తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తో మంగళవారం నాడు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆయన పార్టీ నేతలతో చర్చించారు.ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, ఆత్రం సక్కు మినహా మిగిలిన ఎమ్మెల్యేంతా హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఓటమికి గల కారణాలపై రాహుల్ గాంధీ ఒక్కొక్కరిని ప్రశ్నించారు. టిక్కెట్ల కేటాయింపులో జాప్యంతో పాటు,సీట్ల సర్ధుబాటులో ఆలస్యం కూడ పార్టీ ఓటమికి కారణమని కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్కు వివరించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అనే అంశం కూడ ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు.
పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాహుల్ గాంధీకి వివరించారు. కేసీఆర్తో పోటీ పడే నేతలు కాంగ్రెస్ పార్టీలో లేరని ఆ పార్టీ నేతలు రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు.
కొడంగల్లో రేవంత్ ఎలా ఓడిపోయావని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఖచ్చితంగా గెలవాల్సిన సీటు కదా అంటూ రాహుల్ రేవంత్ ను ప్రశ్నించారు. అయితే తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రేవంత్ రాహుల్కు వివరించారు. డబ్బు పంపిణీ, తనను నిర్భంధించడం తదితర కారణాల వల్ల ఓడిపోవాల్సి వచ్చిందని రేవంత్ రాహుల్కు వివరించినట్టు సమాచారం.