నిర్ణీత కాలంలోనే ప్రతిష్టాత్మక సంస్ధలను ఏర్పాటు చేసేవిధంగా యుద్ధప్రాతిపదికన కార్యక్రమాలను పూర్తి చేయటం ద్వారా మాలక్ష్మి గ్రూప్ అమరావతి నిర్మాణంలో కీలక భూమికను పోషించడం ముదావహమని సాధారణ పరిపాలనశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ అన్నారు. మాలక్ష్మి గ్రూపు నేతృత్వంంలో అంతర్జాతీయ స్ధాయి విద్యాసంస్ధతో పాటు ఐదు నక్షత్రాల హోటల్ సైతం నవ్యాంధ్రలో ఏర్పడనుండటం స్వాగతించదగ్గ పరిణామమన్నారు.
సీడ్ యాక్సిస్ రోడ్డులో తిరుమల తిరుపతి దేవస్ధానముల నేతృత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఎదురుగా బుధవారం వీటి నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సవాంగ్ మాట్లాడుతూ ప్రభుత్వం పలు సంస్ధలకు భూములు కేటాయించినప్పటికీ మాలక్ష్మి తొలిగా భూమిపూజకు రావడం విశేషమన్నారు.
మాలక్ష్మి సామాజిక బాధ్యత ముదావహం: మీనా
ప్రత్యేక అతిధిగా హాజరైన పర్యాటక, బాషా, సాంస్కృతిక, పురావస్తు శాఖ కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా మాట్లాడుతూ సామాజిక బాధ్యతను గుర్తెరిగి మాలక్ష్మీ, గ్లెండేల్ సంస్ధలు అమరావతి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని నిర్ణయించటం స్పూర్తిదాయకమన్నారు. రాజధాని పరిధిలోని మూడు మండలాలలో 100 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఉపకారవేతనాలుగా ఇవ్వాలని నిర్ణయించటం వారి ఔదార్యాన్ని ప్రతిబింబింస్తుందన్నారు. మాలక్ష్మి వ్యవస్దాపకులు వై.హరిశ్చంద్రప్రసాద్ మాట్లాడుతూ రూ.200 కోట్ల అంచనా వ్యయంతో మాలక్ష్మి డబుల్ ట్రీ బై హిల్టన్ పేరిట ఏదు నక్షత్రాల హోటల్ రూపుదిద్దుకోనుందని నాలుగు ఎకరాల విస్గీర్ణంలో అత్యాధునిక హంగులతో మాలక్ష్మి డబుల్ ట్రీ అమరావతికే ప్రతిష్టాత్మకంగా అవతరించనుందన్నారు. 2000 మంది ఏకకాలంలో వీక్షించగలిగేలా కన్వేన్షన్ సెంటర్, వరల్డ్ క్లాస్ స్విమ్మింగ్ పూల్, సర్వీస్ అపార్ట్మెంట్స్ సైతం ఈ నిర్మాణంలో అంతర్భాగంగా ఉంటాయన్నారు. ఈ రంగంలో అగ్రగామి బ్రాండ్గా పేరు గాంచిన హిల్టన్తో తాము భాగస్వామ్యం అయ్యామన్నారు.
చిన్నారులకు కేంబ్రిడ్జ్ సిలబస్..
మరోవైపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో మాలక్ష్యి గ్లెండేల్ పేరిట నిర్మించనున్న అంతర్జాతీయ విద్యాసంస్ధను రానున్న విద్యాసంవత్సరం నాటికే అమరావతి వాసులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ధ్యేయంతో వేగంగా ముందడుగు వేస్తున్నామని సంస్ధ సిఇఓ సందీప్ మండవ పేర్కోన్నారు. ఇందుకోసం రూ.80 కోట్లు వ్యయం చేస్తున్నామన్నారు. ఇక్కడ కేంబ్రిడ్జ్ సిలబస్ చిన్నారులకు బోధించటం జరుగుతుందని, విద్యార్ధి ఉపాద్యాయిల నిష్పత్తి పరంగానూ తాము నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నామని తెలిపారు. సాధారణ బోర్డింగ్ విధానానికి భిన్నంగా చిన్నారులు తమ తల్లిదండ్రులకు దగ్గరగా ఉండేలా డే బోర్డింగ్, వీక్ బోర్డింగ్ వంటి సేవలను అందుబాటులో ఉంటాయన్నారు. డే బోర్డింగ్లో మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం అందిస్తామని, వీక్ బోర్డింగ్ సోమవారం ఉదయం ప్రారంభమై శుక్రవారం సాయంత్రం ముగుస్తుందని తెలిపారు. ఈ వెంచర్ల ద్వారా అద్బుత అమరావతి నిర్మాణంలో తాము భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందని, తమకు నిరంతర సహకారం అందిస్తూ అమరావతి నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు, పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్, మంత్రి నారాయణ, సిఆర్డిఎ కమీషనర్ శ్రీధర్, ఇతర అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఙతలు తెలిపారు. అనంతరం అమరావతి అభివృద్దిని కాంక్షిస్తూ సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.