ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. రాబోయే ప్రపంచ కప్ ఆటల్లో జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ని భారత జట్టు నిషేదించాలని ఆ ఆటను బహిష్కరించాలని మాజీ ఆటగాళ్లు అభిమానులు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై నిర్ణయం ఇవాలే ఖరారు కానుంది. ప్రపంచకప్లో పాకిస్థాన్తో భారత్ మ్యాచ్ ఆడాలా..? బహిష్కరించాలా..? అనేది ఈరోజు తేలిపోనుంది.
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. కానీ.. ఆ మ్యాచ్ను టీమిండియా బహిష్కరించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భారత్ జట్టు ఆ మ్యాచ్ను బహిష్కరిస్తే..? పాకిస్థాన్ని విజేతగా ప్రకటించి రెండు పాయింట్లు కేటాయిస్తారు. అంటే.. మనమే ఆ జట్టుని గెలిపించి టోర్నీలో ముందజ వేసేలా చేస్తున్నామని నిన్న సునీల్ గవాస్కర్ గుర్తు చేశాడు. దీంతో..అంటే కాకుండా బ్రాడ్క్యాస్టర్లకి బిసిసిఐ 100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఈ మ్యాచ్పై సందిగ్ధంలో పడిపోయింది.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై ఓ నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ పాలకుల కమిటీ ఈరోజు సమావేశమవుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ను ప్రపంచకప్ నుంచి నిషేధించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ రాయడంపై కూడా ఈరోజు సమావేశంలో చర్చించనున్నారు. ఒకవేళ ఈ అభ్యర్థనని ఐసీసీ తిరస్కరిస్తే..? అప్పుడు పాకిస్థాన్తో మ్యాచ్ను బహిష్కరించే అంశాన్ని తెరపైకి తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది.