ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పోటీ చేసే స్థానంపై సందిగ్ధత వీడింది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి స్థానం నుంచి ఆయనను బరిలో దించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విస్తృత చర్చల అనంతరం లోకేశ్ను ఈ స్థానం నుంచి బరిలో దించాలని పార్టీ అధినేత నిర్ణయించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేశ్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
రాజధాని ప్రాంతంగా మంగళగిరి అభివృద్ధి చెందడంతో పాటు మున్ముందు సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే లోకేశ్ ఇక్కడినుంచే బరిలో దించితే బాగుంటుందని చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది. తొలుత కుప్పం, భీమిలి, విశాఖ ఉత్తరం, పెదకూరపాడు వంటి నియోజకవర్గాల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ ఆఖరుకు మంగళగిరిని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో లోకేశ్ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో తెదేపా అభ్యర్థి ఓటమిపాలయ్యారు.
మరోవైపు, ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తున్నవేళ అభ్యర్థుల జాబితాపై తెదేపా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎక్కడి నుంచి ఎవరిని బరిలో దింపాలనే అంశంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. తెదేపా ఇప్పటికే అభ్యర్థుల జాబితాను సిద్ధంచేసినప్పటికీ.. పెండింగ్ స్థానాలపై సీఎం చంద్రబాబు రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సీట్లపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. ఒంగోలు లోక్సభ స్థానం నుంచి మంత్రి శిద్ధా రాఘవరావును బరిలో దించుతున్నట్టు సమాచారం.